Monday 22 August 2011

jagan

| |
జగన్ వర్గం ఎమ్మెల్యేలు 29 మంది రాజీనామా
స్పీకర్ ఫార్మాట్‌లోనే అసెంబ్లీ కార్యదర్శికి
అందజేసిన రాజీనామా లేఖలు : పిల్లి
హైదరాబాద్, ఆగష్టు 22 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని సమర్ధిస్తున్న 29 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ ఆ లేఖలను సోమవారం అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఇద్దరు, పీఆర్పీ ఎమ్మెల్యే ఒకరు మొత్తం 29 మంది తమ పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలు స్పీకర్ ఫార్మాట్‌లోనే అందజేశామని పిల్లి సుభాష్ చంద్రబోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అందుబాటులో లేకపోవడంతో తమ రాజీనామా లేఖలను కార్యదర్శికి అందజేసినట్లు తెలిపారు.

2004కు ముందు రాష్ట్రంలో కాంగ్రె స్ పార్టీ దిక్కులేని స్ధితిలో ఉండగా మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మండుటెండలో 67 రోజుల పాటు, 470 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీకి జవజీవాలు పోసి, రెండు సార్లు అధికారంలోకి తీసుకు వచ్చిన మహోన్నత వ్యక్తని కొనియాడారు. ఏ ముఖ్యమంత్రి చేయని పలు సంక్షేమపథకాలను ప్రవేశపెట్టారని, అటాంటి వ్యక్తిపై నిందలు మోపి, సీబీఐ విచారణ నెపంతో వైఎస్‌ను, జగన్‌ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారని, దీన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఆయన ఆశయాలను తుంగలోతొక్కిన ఈ నీతిమాలిన ప్రభుత్వంలో ఇమడలేక రాజీనామాలు చేస్తున్నాట్లు పిల్లి వివరణ ఇచ్చారు.

మేమే కాదు, వైఎస్‌ను అభిమానించే సభ్యులదరూ రాజీనామాలు చేయాలని, అదే వైఎస్‌కు మనమిచ్చే నిజమైన నివాళని పిల్లి సుభాష్ చంద్రబోష్ పేర్కొన్నారు. వైఎస్ ప్రతిష్టను చూసి ఓర్వలేని కాంగ్రెస్ ఆ దివంగత నేతపై కుట్రలు, కుతంత్రాలు పన్ని దోషిగా నిలబెట్టేందుకు యత్నిస్తోందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి కాంగ్రెస్‌లో ఇమడలేకనే తాము రాజీనామాలు చేశామని, తమ రాజీనామాలే వైఎస్‌కు నిజమైన నివాళి అని ఎమ్మెల్యేలు తెలిపారు.

కాగా అంతకు ముందు జగన్ ఆస్తుల కేసులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయడంపై నిరసనగా జగన్‌వర్గం నేతలు పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్‌వర్గం ఎమ్మెల్యేలు లోటస్ పాండ్ నుంచి వోల్వో బస్సులో అసెంబ్లీకి బయలుదేరారు. ముందుగా పంజాగుట్టలోని దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాళలు వేసి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు. ఇద్దరు ఎంపీలు మేకపాటి, సబ్బంలు ఫ్యాక్స్ ద్వారా లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా పంపనున్నారు.

0 comments: